వరలక్ష్మీ వ్రతం
₹ Ask Me
వరలక్ష్మీ
వ్రతం
హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు. కొత్త జంటలు సంతానం కోసం, తమ కుటుంబం, జీవిత భాగస్వామి, సంతోషం కోసం, ఆదాయం, ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రతం విశిష్టత • పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన కథ • శ్రావణమాసం పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్షీ వ్రతం • వ్రతం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.
Note:
వరలక్ష్మి వ్రత కథ పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను .శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేంది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.| Sl.No | Item | Quantity |
|---|---|---|
| 1 | పసుపు | 50 గ్రాములు |
| 2 | కుంకుమ | 50 గ్రాములు |
| 3 | దారం | 1 |
| 4 | గంధం | (చిన్న డబ్బా) |
| 5 | అగరబత్తి | 1 ప్యాకెట్ |
| 6 | కర్పూరం | 1 ప్యాకెట్ |
| 7 | దీపారాధన నూనె | 1/4 లీటర్ |
| 8 | వత్తులు | 1 ప్యాకెట్ |
| 9 | బియ్యం | 3 కిలోలు |
| 10 | తువ్వాళ్లు (తెలుపు) | 2 |
| 11 | జాకెట్ పీస్ | 2 |
| 12 | రాగి చెంబు | 1 |
| 13 | కొబ్బరికాయలు | 3 |
| 14 | వక్కలు | 50 గ్రాములు |
| 15 | ఖర్జూరం | 50 గ్రాములు |
| 16 | నాణేలు | 30 |
| 17 | తమలపాకులు | 35 |
| 18 | పువ్వులు | 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా) |
| 19 | పండ్లు | అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5) |
| 20 | మామిడి ఆకులు | కొన్ని |
| 21 | ప్రసాదం | ఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు |
| 22 | చిత్రపటం లేదా ప్రతిమ. | 1 |
| 23 | గిన్నె | కొబ్బరి నీళ్ల కోసం |
| 24 | ఏక హారతి | 1 |
| 25 | గంట | 1 |
| 26 | తువ్వాలు | చేతులు తుడుచుకోవడానికి |
| 27 | పంచ పాత్ర | |
| 28 | దీపారాధన కుందులు | 2 |
| 29 | దర్భలు | కొన్ని |
| 30 | పంచామృతం | పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార |
| 31 | పళ్లెం | 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి |
| 32 | పీటలు లేదా ఆసనాలు | కూర్చోడాని |